ఆశా వర్కర్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన
_పాత కార్మిక చట్టాల అమలు చేయాలని డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆశా వర్కర్లు బ్లాక్ డే పాటిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్కర్లు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆమె కోరారు.“నాలుగు లేబర్ కోడ్ల అమలు రోజును కార్మికుల జీవితాల్లో చీకటి రోజుగా (బ్లాక్ డే)గా గుర్తిస్తాం. ప్రభుత్వం పునరాలోచించి ఈ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలి,” అని ఆమె పేర్కొన్నారు.యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఉన్నికృష్ణ మాట్లాడుతూ, 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయని అన్నారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ, కీసర తదితర ప్రాంతాల్లో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లత, యాదమ్మ, మమత, ప్రవీణ్ తదితరులు, స్థానిక ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Comments