పారాక్వాట్ పురుగుమందుపై 60 రోజుల నిషేధం
_ప్రజా ఆరోగ్యం, రైతుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం
మేడ్చల్ మల్కాజిగిరి, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పారాక్వాట్ పురుగుమందుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు , తేది: 31.03.2026) తక్షణమే అమల్లోకి వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కె. చంద్రకల తెలిపారు.ఈ ఉత్తర్వుల ప్రకారం పారాక్వాట్ మరియు దాని అనుబంధ రసాయన ఫార్ములేషన్ల అమ్మకాలు, నిల్వ, పంపిణీ, తయారీ మరియు వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉంటుంది.ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా ప్రజా ఆరోగ్యం, రైతుల రక్షణ, జంతువుల భద్రతను ప్రభుత్వం పేర్కొంది. పారాక్వాట్ వినియోగం వల్ల మనుషులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.వ్యవసాయ పనుల్లో దీన్ని వాడే రైతులకు ప్రమాదకరమని, అలాగే పశువులకు కూడా హానికరమని అధికారులు గుర్తించారు.ఇన్సెక్టిసైడ్స్ చట్టం, 1968లోని సెక్షన్ 27 ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి పారాక్వాట్ విక్రయించినా లేదా నిల్వ చేసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలోని ఎరువులు, పురుగుమందుల డీలర్లు, తయారీదారులు మరియు రైతులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిషేధం అమలుపై వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచనున్నట్లు తెలిపారు.


Comments