ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
జమ్మికుంట టౌన్, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభలు ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా సాగాయి.
మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో 23, 24, 12వ వార్డుల్లో నిర్వహించిన సభల్లో ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించారు. అనంతరం “జయ జయహే తెలంగాణ” రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇందిరమ్మ ఇళ్ల, డబుల్ బెడ్ రూమ్ పథకాలు, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, మహాలక్ష్మీ పథకం కింద గ్యాస్ సబ్సీడీ వంటి అంశాలపై వివరాలు వెల్లడించారు. అలాగే తడి–పాడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నిర్మూలన, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు. ఇంటి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్సులు సమయానికి చెల్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మోలుగు ప్రణీత, చుంచు రమాదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, వార్డు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఇక 18వ వార్డులో జరిగిన సమావేశంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై చర్చ జరిగింది. కౌన్సిలర్ కూతాటి తిరుపతి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అయితే 9వ వార్డులో సభ నిర్వహణపై వివాదం నెలకొంది. కౌన్సిలర్ ఇంట్లో సభ నిర్వహించడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ భవనాల్లోనే సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా ఈ వార్డు సభలు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తున్నాయి. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో ఈ కార్యక్రమాలు కీలకంగా మారాయి.


Comments