కంకర రోడ్డు కానరావడం లేదా?”
నరకయాతన పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని పాలకులు
పరీక్షల సీజన్, పంటల కాలంలోనూ నిర్లక్ష్యం –
స్టేషన్ ఘనపూర్–తాటికొండ రహదారి దుస్థితి
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్2: తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం కేంద్రం నుండి తాటికొండ గ్రామం వరకు ఉన్న రహదారి ప్రస్తుతం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గతంలో ఉన్న రోడ్డును తవ్వి కంకర పరిచి వదిలేయడంతో, ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
పరీక్షల కాలం కావడంతో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణించడం కష్టసాధ్యంగా మారింది. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే నర్సరీ నుండి 9వ తరగతి వరకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక రైతులు పంటలు కోయించి ట్రాక్టర్లలో తరలించే ఈ సమయంలో రహదారి దుస్థితి మరింత ఇబ్బందులు కలిగిస్తోంది. కంకర రోడ్డుతో ట్రాక్టర్లు దెబ్బతినడం, ఆలస్యాలు జరుగడం వల్ల రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి.
ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు రోజూ ఈ రహదారిపై ప్రయాణిస్తూ వాహన మరమ్మత్తుల ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ప్రతి రోజు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
“కంకర రోడ్డు కానరావడం లేదా?” అంటూ స్థానికులు పాలకులు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపైనే అభివృద్ధి చూపిస్తూ, వాస్తవ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం అయినా అధికారులు స్పందించి, కాంట్రాక్టర్లతో మాట్లాడి రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


Comments