99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పామిరెడ్డి పల్లి గ్రామసభ
పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రైతు వేదికలో గ్రామ సర్పంచ్ శ్రీమతి మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన జరిగింది.ఈ గ్రామసభలో గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు మరియు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.గ్రామంలో రైతు రుణమాఫీ కింద 315 మంది లబ్ధిదారులకు రూ.212.90 లక్షలు, రైతు భరోసా పథకం కింద 1094 మంది లబ్ధిదారులకు రూ.108.90 లక్షలు అందించబడినట్లు తెలిపారు. వరి ధాన్య సేకరణలో 292 మంది రైతులకు రూ.311.35 లక్షలు చెల్లించగా, కొత్తగా 269 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.అలాగే ఉచిత విద్యుత్ పథకం కింద 430 మంది లబ్ధిదారులు ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 24 మందికి రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.11.41 లక్షల వడ్డీ లేని రుణాలు అందించగా, చేయూత పెన్షన్లు 328 మందికి అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా చర్చించారు.గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నాయని, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ఆశీస్సులతో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు.ప్రస్తుతం మూడు నెలల కాలవ్యవధిలో రూ.30 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పామిరెడ్డిపల్లి గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టినందుకు గ్రామ ప్రజల తరపున శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మాజీ ఎంపీటీసీ ఇంద్ర లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


Comments