మానవతా సేవకు నిదర్శనం… చలివేంద్రంతో ముందుకు సత్యసాయి సమితి
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి వేడిమిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలు, బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ తెలిపారు.
ఈ చలివేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 60 రోజుల పాటు చల్లటి మినరల్ వాటర్ను ఉచితంగా అందించనున్నారు. అదనంగా వారానికి రెండు రోజులు రాగి జావా, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయి సేవా సమితి సమాజ సేవలో ఎప్పుడూ ముందుండి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సమయంలో అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ వేసవి కాలంలో ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకుని తమ దాహార్తిని తీర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం సావిత్రి, చందా విశ్వనాథం, గన్ను ఉపేందర్, గౌరీశెట్టి సత్యనారాయణ తదితర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


Comments