కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు గోపాల్పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ 2005కు ముందు జయన్న తిరుమలాపురం గ్రామ ప్రజలు వలసలు వెళ్లేవారని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడంతో గ్రామ ప్రజలు వ్యవసాయం, పాడి పరిశ్రమల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో గ్రామపంచాయతీ భవనం, సబ్స్టేషన్, బస్ షెల్టర్, వెటర్నరీ ఆసుపత్రి, దేవాలయాల పునర్నిర్మాణం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, వడ్లకు బోనస్, చెరువుల పునరుద్ధరణ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వంటి పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. గ్రామ అభివృద్ధికి విద్య ముఖ్యమని, పిల్లలను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను మహిళలు ముందుండి మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తుందని తెలిపారు.గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, భవిష్యత్తులో ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్, ఉప సర్పంచ్ రాజు, అమరేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments