ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమాన్ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి హనుమంతుని దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు.అలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పఠనం, నామస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు భక్తి గీతాలతో మార్మోగాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తాడని అన్నారు. హనుమాన్ జయంతి కేవలం పండగ మాత్రమే కాకుండా మన జీవితంలో శక్తి, ఆత్మవిశ్వాసం, నిబద్ధతను పెంపొందించే పవిత్ర దినమని పేర్కొన్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప గుణాన్ని హనుమంతుడు మనకు నేర్పుతాడని ఆయన అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, భయాలను తొలగించి ధైర్యాన్ని నింపే అభయాంజనేయుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆకాంక్షించారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసే శక్తి హనుమంతుని భక్తితోనే సాధ్యమని ఆయన తెలిపారు.ప్రజలందరికీ విజయం, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Comments