99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వెల్టూర్ గ్రామసభ
పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అశోక్ అధ్యక్షతన జరిగింది.ఈ గ్రామసభలో గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు మరియు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.గ్రామంలో రైతు రుణమాఫీ కింద 456 మంది లబ్ధిదారులకు రూ.346.18 లక్షలు, రైతు భరోసా పథకం కింద 1300 మంది లబ్ధిదారులకు రూ.131.06 లక్షలు అందించబడినట్లు తెలిపారు. వరి ధాన్య సేకరణలో 211 మంది రైతులకు రూ.205.13 లక్షలు చెల్లించగా, కొత్తగా 1385 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.అలాగే ఉచిత విద్యుత్ పథకం కింద 545 మంది లబ్ధిదారులు ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 34 మందికి రూ.1.70కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.24.80లక్షల వడ్డీ లేని రుణాలు అందించగా, చేయూత పెన్షన్లు 555 మందికి అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా చర్చించారు.గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నాయని, గ్రామ పెద్దలు తెలిపారు.ప్రస్తుతం మూడు నెలల కాలవ్యవధిలో లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్ ,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సమాఖ్య సిబ్బంది, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు, అధికారులు పాల్గొన్నారు.


Comments