భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ -02(తెలంగాణ ముచ్చట్లు)
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు క్రిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తహసిల్దార్ కార్యాలయం వద్ద భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ లు అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ రూపొందించామని అన్నారు. కూసుమంచి మండలంలో ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఆ వివరాలు సర్వేయర్ కు కూడా వెళ్తుందని అన్నారు.
రైతులు ఇంటి వద్ద నుంచి కూడా స్లాట్ బుకింగ్ చేసుకునేలా పోర్టల్ తయారు చేశామని, రైతులు లాగిన్ కాగానే భూమి వివరాలు కనిపిస్తాయని, ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత గ్రామంలోని లైసెన్స్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల లోపు సర్వే పూర్తి చేస్తారని, ఈ వివరాలను సర్వేయర్ సిస్టంలో నమోదు చేశాక దరఖాస్తుదారుడైన రైతు సర్వే మ్యాప్ నకు యూనిక్, భూధార్ నెంబర్లు కేటాయిస్తారని భూభారతి పోర్టల్ లో కూడా వివరాలు నిక్షిప్తమవుతాయని అన్నారు.
సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ జనరేట్ చేసి పోర్టల్ లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తాయని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందుగా కూసుమంచి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అమలు చేస్తున్నామని ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మిగిలిన మండలాలకు దీనిని ప్రభుత్వం విస్తరిస్తుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.


Comments