గుడ్ ఫ్రైడే సందర్భంగా తాటికాయలలో యేసు సిలువ మార్గ యాత్ర
ధర్మసాగర్,ఏప్రిల్03(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ సిలువ మార్గ యాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ యాత్రను విచారణ గురువులు ఫాదర్ రామంచ శరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్ర పవన్ కళ్యాణ్ యేసు ప్రభువు వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. యాత్రలో పాల్గొన్న భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాదర్ రామంచ శరత్ కుమార్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకునే పవిత్ర దినమని తెలిపారు. మన పాపాల విమోచన కోసం యేసు సిలువపై అనుభవించిన బాధలు మానవాళికి ప్రేమ, క్షమ, త్యాగానికి నిదర్శనమని అన్నారు. ప్రతి క్రైస్తవుడు యేసు బోధించిన ప్రేమ, క్షమ, వినయం వంటి విలువలను జీవితంలో ఆచరించాలని సూచించారు.అలాగే సిలువ మార్గ యాత్ర ద్వారా యేసు క్రీస్తు ఎదుర్కొన్న శ్రమలను మనసులో నాటుకొని, ఆత్మపరిశీలనతో జీవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం నెలకొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ పెద్దలు పట్ల రాంచందర్, ఎర్ర యాదగిరి, వార్డు సభ్యులు పట్ల రమేష్, బొల్లెపాక అనిత, పట్ల యాదమ్మతో పాటు గ్రామ పెద్దలు, డాన్ బోస్కో యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



Comments