ఎర్రజెండా ప్రజలది అది పేదల ఆశలు పోరాటాల ప్రతీక
సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి
ఎల్కతుర్తి, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
త్యాగాలకు, పోరాటాలకు కేంద్రంగా నిలిచిన సిపిఐ పార్టీని ప్రజలు ఆదరించాలని జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో సిపిఐ నాయకులు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులు ఎన్నో కష్టాలు, నిర్బంధాలు ఎదుర్కొన్నారని తెలిపారు. సమానత్వ సమాజం కోసం, పేదల హక్కుల సాధన కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.
భూ సంస్కరణలు అమలు చేయాలని, “దున్నేవానికి భూమి” అనే నినాదంతో సిపిఐ లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో నైజాం పాలనలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించి వేలాది గ్రామాలను విముక్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు మరింత తీవ్రంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం వల్ల పేదలకు విద్య, వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పోరాటాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రజలు సహకరించి విరాళాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, మండల కార్యదర్శి రాజ్కుమార్, కామెర వెంకటరమణ, నిమ్మల మనోహర్, తండ ముండయ్య, సర్పంచ్ కర్రె లక్ష్మి, సూర మొగిలి మాధవరావు, గడ్డం లలిత, కర్రె రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments