మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ
సత్యనాదెళ్లను కోరిన సిఎం రేవంత్ రెడ్డి
-రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి
--మంత్రులతో కలిసి సత్యనాదెళ్ళ నివాసానికి వెళ్లిన సిఎం
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.
ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కల్పన ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని, హైదరాబాద్ను ప్రపంచంలోని అగ్ర నగరాల్లో నిలబెడతాయని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ను టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐ, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతు అవసరమని కోరారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త తయారీ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి సత్య నాదెళ్లకు వివరించారు.
ఈ సమావేశంలో సత్య నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ,ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు..jpeg)


Comments