దేశంలో రక్తహీనత కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియదా..?
మహిళలు.. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది..
* లోక్ సభలో లిఖితపూర్వకంగా కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
దేశంలో మహిళలు, గర్భిణులు, బాలింతలు.. పిల్లలపై రక్తహీనత తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియదా..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రశ్నించారు. దీని నివారణకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో వచ్చిన మార్పు వివరాలు ఏమిటని అడిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నలో కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానమిచ్చారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం.. దేశంలోని 15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో రక్తహీనత 57 శాతం, 6-59 నెలల వయస్సు గల పిల్లల్లో 67.1 శాతంగా ఉందని తెలిపారు. నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) అనే కార్యక్రమాన్ని 6X6X6 వ్యూహంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలలకు సంబంధించి 6-59 నెలలు, 5-9 సంవత్సరాలు, కౌమారదశలో 10-19 ఏళ్ళు, మహిళలు 15- 49 సంవత్సరాలు లోపు వారు, గర్భిణులు, బాలింతలకు ఆరు దశల్లో రోగనిరోధక ఇనుము, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ (IFA) సిరప్ ఇస్తున్నట్లు తెలిపారు.గర్భిణులు, బాలింతలకు రెండో త్రైమాసికంలో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలుఅందజేస్తున్నామన్నారు.
ప్రతి ఏటా అంచనా..
ఏడాది పొడవునా డిజిటల్ ఇన్వాసివ్ హిమోగ్లోబినో మీటర్ తో గర్భిణులు, మహిళల్లో రక్తహీనతను పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి తన జవాబులో వివరించారు. అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ద్వారా.. పౌష్టికాహారం అందేల చూస్తున్నామని తెలిపారు. అలాగే.. జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాలతో రక్తహీనత ముక్త్ భారత్ అమలును అంచనా వేయిస్తున్నట్లు తెలిపారు. ఇంకా..ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు, ఆశ కార్యకర్తలు
క్షేత్రస్థాయిలో రక్తహీనత నివారణ కోసం సమష్టిగా కృషి చేస్తున్నట్లు వివరించారు.


Comments