పిడుగుపాటుకు రైతు మృతి.
- లచ్చన్నగూడెంలో విషాదం.. కుటుంబానికి పెద్దదిక్కు దూరం.
- ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాకముందే విషాదం.. ఆదుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి.
వేంసూరు, సెప్టెంబరు 19 (తెలంగాణ ముచ్చట్లు):
పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన వేంసూరు మండలం లచ్చన్నగూడెంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన పర్స ఆనందరావు (52), అంజయ్య కుమారుడు, వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. దుక్కి దున్నుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల మధ్య ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆనందరావు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆనందరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆనందరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇంకా వివాహాలు జరగలేదు. కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కుగా ఉన్న ఆనందరావు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తండ్రి మృతితో కుమార్తెల రోదనలు మిన్నంటాయి. ఆనందరావు మృతితో లచ్చన్నగూడెంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Comments