రత్నతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.
చిల్పూర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని లింగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రత్నతండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం రత్నతండాను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంది.సుమారు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన రత్నతండాలో 13 కుటుంబాలకు చెందిన 60 మంది నివసిస్తున్నారని రాపర్తి రాజు తెలిపారు. తండాకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్య, వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తండాలో రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశా కార్యకర్తలు కూడా సక్రమంగా అందుబాటులో ఉండటం లేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి తండాకు రోడ్డు నిర్మించడంతో పాటు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్, ఆవుల ప్రభాకర్, అపారదాపు రాజు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments