సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
_164 ముగ్గులతో శక్తి సాయి నగర్లో తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసింది
మల్లాపూర్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శక్తి సాయి నగర్ డివిజన్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మల్లికార్జున్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజ్గిరి కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీంద్రసాగర్, మహిళా నాయకురాలు లలిత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 164 మంది మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందకరమని అన్నారు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు ఎక్కడా తగ్గలేదని, గొబ్బెమ్మలు, బసవన్నలు వంటి సంక్రాంతి ప్రత్యేక అలంకరణలు చూడటం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాదాపు 500 నుంచి 600 మంది మహిళలు పాల్గొనడం విశేషమని, మహిళల్లో కనిపించిన ఉత్సాహం అభినందనీయమని కొనియాడారు. సంక్రాంతి పండుగ అంటే ధాన్యం, ధనం, ఆనందం ఇంటికి వచ్చేవేళ అని పేర్కొంటూ, ఈ పండుగను పల్లె సంస్కృతితో జరుపుకోవడం మన అనాదిగా వస్తున్న సంప్రదాయమని అన్నారు.పోటీల్లో గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతి: రూ.5,000.ద్వితీయ బహుమతి: రూ.3,000.తృతీయ బహుమతి: రూ.2,000.చతుర్థ బహుమతి: రూ.1,000.అలాగే, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళా సోదరీమణికి ఒక చీరను బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జి. ఆంజనేయులు సాగర్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు సబితా యాదవ్, సీనియర్ నాయకురాలు అపర్ణ గౌడ్, అఖిల సాగర్, ముత్యం రెడ్డి, డివిజన్ సెక్రటరీ రమేష్ సాగర్, పుణ్యవతి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments