రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!
డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.
సత్తుపల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండల పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి నల్లంటి రాంబాబును రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పరామర్శించారు.
వేంసూరు–విజయవాడ ప్రధాన రహదారిపై రాణి ఫంక్షన్ హాల్ సమీపంలో డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మోటార్ బైక్పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న క్రమంలో విజయవాడ వైపు వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో నల్లంటి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆయన వెన్నుపూసకు బలమైన దెబ్బ తగలగా, కాలు విరిగింది. స్పృహ కోల్పోయిన ఆయనను స్థానికులు వెంటనే స్థానిక పట్టణంలో రఘురాం ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఖమ్మంలోని వేద ఆసుపత్రిలో ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా, వెన్నుపూస భాగంలో తీవ్రమైన వాపు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. సుమారు రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సిద్ధారం గ్రామానికి చేరుకుని నల్లంటి రాంబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య నివేదికలను పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కమిటీ నాయకులు, సిద్ధారం గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments