పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
కబ్జా ప్రయత్నాలకు చెక్
– రెండు వేల గజాల పార్కు రక్షణ
శేరిలింగంపల్లి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు శుక్రవారం రక్షించారు. పార్కుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన రెండు వేల గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి బై నంబర్లు సృష్టించి ప్లాట్లుగా మార్చారు. ప్రతి ప్లాట్లో షెడ్లు నిర్మించి కబ్జాకు ప్రయత్నించారు.
రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో హైడ్రా ప్రజావాణి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ స్థలం లేఅవుట్లో పార్కు, కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించబడినదని నిర్ధారించారు.తదుపరి హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించి, వెంటనే ఫెన్సింగ్ వేసి ‘పార్కు స్థలం – హైడ్రా రక్షణలో ఉంది’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థలం మార్కెట్ విలువ దాదాపు రూ.30 కోట్లుగా అంచనా.
హైకోర్టు ఆదేశాలతో నిలిచిన అనుమతులు
200 గజాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబర్లు సృష్టించి, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడమే కాకుండా భవన నిర్మాణానికి అనుమతులు కూడా పొందినట్లు తేలింది. అయితే హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఆ అనుమతులను వెనక్కి తీసుకోవడంతో పాటు రెగ్యులరైజేషన్ను కూడా రద్దు చేసింది.


Comments