సమాచార హక్కు చట్టం అమలుకు కమిషనర్ల నియామకంపై కవితకు వినతి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్లో బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆదివారం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్, ఇతర రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, కవిత మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం దేశ పౌరులకు సమాచారం పొందడం మౌలిక హక్కు అని గుర్తుచేశారు. రాబోయే శాసన మండలి సమావేశాల్లో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై ప్రస్తావిస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి కమిషనర్ల నియామకానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చంటి ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెక్షన్ 6(1) ప్రకారం సమాచార దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, చాలా నెలల పాటు సమాధానం రాకపోవడం పౌరుల హక్కులకు ఆటంకంగా మారిందని వ్యాఖ్యానించారు. సెక్షన్ 19(1), 19(3) ప్రకారం అప్పీల్స్ కోసం స్టేట్ కమిషనర్ల లేకపోవడం వల్ల వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి అన్నారు.
ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, సమాచార హక్కు చట్టాన్ని అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వింజమూరి గణేష్, రాష్ట్ర మహిళా నేతలు స్రవంతి, ప్రియ రెడ్డి, ఎర్రబెల్లి ప్రగతి తదితరులు పాల్గొన్నారు.


Comments