టార్గెట్ 2050 యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
పెరుగుతున్న జనాభా దృష్ట్యా నీటి అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించండి
-జలమండలి తన సొంత ఆదాయాన్ని పెంచుకోవాలి
-మంజీరా పాత పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త ఆధునిక పైపులైన్లు వేయాలి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
2050 నాటికి హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన మంచినీటి సరఫరా మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జలమండలి బోర్డు సమావేశం జరగడం విశేషం. ఈ సమావేశం హైదరాబాదులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా కోసం గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీల నీటి సరఫరాకు బదులుగా, మహానగరానికి అవసరమైన 20 టీఎంసీల నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
అంతేకాక, మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నదుల నుండి జరుగుతున్న నీటి సరఫరాను మరింత మెరుగుపరచాలని, 1965లో మంజీరా ద్వారా వేసిన పాత పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త ఆధునిక పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
సమావేశంలో జలమండలి ఆర్థిక నిర్వహణ, ఆదాయ వ్యయాలపై సమగ్ర చర్చ జరిగింది. జలమండలి తన సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను పరిశీలించాలని, నూతన ప్రాజెక్టులకు అవసరమైన నిధులను తక్కువ వడ్డీ రుణాల రూపంలో సమకూర్చుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్లు త్వరితగతిన సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
అంతేకాక, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాతో పాటు సివరేజీ వ్యవస్థను కూడా ఆధునీకరించడానికి, ప్రత్యేక ఏజెన్సీలు, కన్సల్టెన్సీల సహకారంతో సమగ్ర అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments