హెచ్ఎంటి నగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు త్వరలో ప్రారంభం
ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా హామీ
నాచారం, జనవరి 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం పరిధిలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా హామీ ఇచ్చారు.హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విస్తృతంగా పెరిగి చెరువు పరిసర ప్రాంతాల్లో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతున్న విషయాన్ని ఇదివరకే జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను కలిసి గుర్రపు డెక్క తొలగింపుకు సంబంధించిన మరిన్ని వివరాలను విన్నవించారు.ఈ సందర్భంగా కాప్రా సర్కిల్కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో, దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. అలాగే మిగిలి ఉన్న గుర్రపు డెక్కను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత సంవత్సరం మెయింటెనెన్స్ కాంట్రాక్టు ముగిసినందున, కొత్త కాంట్రాక్టర్ను నియమించి చెరువు సంరక్షణ పనులను పకడ్బందీగా చేపట్టాలని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జోనల్ కమిషనర్ను కోరారు.ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, త్వరలోనే గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Comments