ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
వార్డ్ కౌన్సిలర్ పెడకంటి కృష్ణయ్య (ఆర్.కె)
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)
కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ 18వ వార్డ్ కౌన్సిలర్ పెడకంటి కృష్ణయ్య (ఆర్.కె) సోమవారం సబ్ కలెక్టర్ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా సేవలకు కేటాయించిన మున్సిపల్ కార్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించడం గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్చి 31, 2026న సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని తెలిపారు. మంత్రులు, ఇన్చార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యే ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేసి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫోటోలు లేకపోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే కార్యక్రమాల్లో నిష్పాక్షికతగా ఉండాల్సిన అవసరం ఉందని, అయితే ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు ప్రజల్లో తప్పుడు సంకేతం తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సబ్ కలెక్టర్ను కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు


Comments