డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మూడు రోజులు జైలు శిక్ష: ట్రాఫిక్ ఏసీపీ
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు ఖమ్మం స్పెషల్ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ( స్పెషల్ మొబైల్ కోర్టు) బి. నాగలక్ష్మి మూడు రోజులు జైలు శిక్ష విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ....మద్యం మత్తులో పట్టుబడిన వారిపై న్యాయస్థానాల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మద్యం సేవిస్తూ తనిఖీల్లో పట్టుబడిన గొల్లగూడెం కు చెందిన లారీ డ్రైవర్ కు మూడు రోజులు శిక్ష విధించడంతో పాటు మరో నలుగురికి ఆరు వేల నుండి 2500/- వరకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోందని, ఒక్కరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోందని అన్నారు. కొన్నిసార్లు మనం కరెక్టుగానే వెళ్తున్నా, అవతలి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలను హరిస్తోందని, అయితే ఎక్కువ కేసుల్లో ప్రమాదాలకు మద్యం మత్తే కారణం అవుతున్నాయని అన్నారు. మందేసి రోడ్లపైకి వస్తున్న కొందరు వాహనదారులు, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాద నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.


Comments