ఎడతెరుపు లేని వర్షాల వల్ల పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు
అధికారులు తక్షణమే స్పందించాలి
-- నక్క కృష్ణ యాదవ్ ఆర్టిఐ మండల అధ్యక్షుడు పెద్దమందడి
పెద్దమందడి,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అని పెద్దమందడి మండల ఆర్టిఐ మండల అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వ, మరియు ప్రైవేట్ పాఠశాలలు కొనసాగించబడుతున్నప్పటికీ, తడిగా ఉన్న వాతావరణం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీఐ ,అఖిలపక్ష ఐక్యవేదిక పెద్దమందడి మండల అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్ స్పందిస్తూ, వర్షాల కారణంగా విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తేమతో కూడిన వాతావరణంలో పాఠశాలలు నిర్వహించడం బాలబుద్ధిని శారీరకంగా, మానసికంగా, దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు ప్రభుత్వాలు తగిన మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాల భవనాలు, హాస్టల్ నిర్మాణాలు భద్రతా పరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు.ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయం అందించేలా అధికారులు ఫీల్డ్ లో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మండలం లో డ్రైనేజ్ మాన్హోల్స్పై ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, చెరువుల కట్టల వద్ద ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణ పెంచి, మెడిసిన్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ తరహా చొరవలు తీసుకుంటేనే విద్యార్థుల ఆరోగ్య భద్రతను కాపాడటం సాధ్యమవుతుందని నక్క కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.


Comments