రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది.. శిక్షలు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. క్రైం రేటు పది శాతం పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం లాభమని.. బీజేపీ ఎమ్మెల్యేలను పని చేయనీయడం లేదని ఫైర్ అయ్యారు. సోమవారం నిజామాబాద్లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టి కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎప్పుడు వస్తారో తెలియదని మండిపడ్డారు. ఆరు నెలల నుంచి పోలీస్ కమిషనర్ ఇక్కడ లేరని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామన్నారని.. ఇంతవరకు ఎవరికీ రాలేదని కవిత అన్నారు.
మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం.. గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన వారు కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ను అభివృద్ధి చేస్తారని అనుకుంటే ఇక్కడ హైడ్రా లాగా నిడ్రా తెస్తా అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను భయాందోళనకు గురి చేయకుండా అభివృద్ధి పనులకు నిధులు తేవాలని కోరారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని చెప్పారు. కాంగ్రెస్ను నిలదీస్తే బీజేపీకి అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.


Comments