నాగారం మున్సిపాలిటీ లో వరద ముంపు సమస్యపై మహిళల రాస్తారోకో
నాగారం, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ప్రతి సారి ఇళ్లు నీటమునిగిపోవడం, రహదారులు చెరువుల్లా మారిపోవడం వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటోందని 22 కాలనీల మహిళలు గళమెత్తారు.సోమవారం పెద్ద సంఖ్యలో మహిళలు నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి మున్సిపల్ డి.ఈ సంతోష్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రధాన రహదారి వెంబడి శాశ్వత మురికినీటి కాల్వ నిర్మించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు.మహిళలు మాట్లాడుతూ, వరదనీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లు గుంతలుగా మారడం, వృద్ధులు బయటకు రావలేని పరిస్థితులు, చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్లలేని ఇబ్బందులు ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తీవ్రంగా విమర్శించారు.
ప్రధాన నినాదాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన మహిళలను పోలీసులు సముదాయించి రాస్తారోకోను ముగింపునకు తీసుకువచ్చారు.
వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ నిరసనలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్ఎల్ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments