కెమికల్ పరిశ్రమల కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్
- పటాన్ చెరువు,తెలంగాణ ముచ్చట్లు:
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా వాయు మరియు నీటి కాలుష్యాన్ని సృష్టిస్తున్న కెమికల్ పరిశ్రమలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ డిమాండ్ చేశారు.
బొల్లారం పరిధిలోని ఆసానికుంటను సందర్శించిన ఆయన, పరిశ్రమలు విడుదల చేసే కెమికల్ నీటి కారణంగా కుంట నిండిపోయి దుర్గంధం వస్తోందని, రసాయనాలను బోర్వెల్ల ద్వారా భూగర్భ జలాల్లోకి పంపించి తీవ్రంగా కాలుష్యం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజిపల్లి పరిశ్రమల నీరు గండిగూడెం చెరువులో చేరి చేపలు, బర్రెలు మరణించడం స్థానిక పరిస్థితుల దారుణతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల వల్ల పటాన్ చెరు, పాశమైలారం, బొల్లారం ప్రాంతాలు కాలుష్యానికి కేంద్ర బిందువులుగా మారాయని, ఈ కాలుష్యం వల్ల సంగారెడ్డి దేశంలోని అత్యంత కాలుష్యిత ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీలు విడుదల చేసే రసాయనాలు చిన్న వాగుల ద్వారా నక్కవాగులో చేరి చివరకు మంజీరా నదిని కలుషితం చేస్తున్నాయని, ఈ నది మూసీ నది తరహాలో మారిపోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువనాయకుడు రోహిత్ సింగ్, డప్పు అరవింద్, సతీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments