అడ్డా కూలీలా "అండం"....బిచ్చగాళ్ళ "వీర్యం" !
వీర్యం, అండాల దందా బహిరంగం
– బిర్యానీ, మద్యం ఆశ చూపి బిచ్చగాళ్ల నుంచి సేకరణ
హైదరాబాద్:
సంతాన భాగ్యం కోల్పోయిన దంపతులకు సాయంగా వీర్యం, అండాల దానం జరిగే పుణ్యపనిని కొందరు వ్యాపారంగా మార్చి అసభ్య మార్గంలో మలిచారు. సికింద్రాబాద్లో ఇండియన్ స్పెర్మ్టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట నడుస్తున్న ఈ దందాలో ఆరోపణలపై గోపాలపురం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
ఈ క్లినిక్ నిర్వాహకుడు పంకజ్ సోని, ఇతనితో కలిసి పనిచేసే మేనేజర్లు, ఏజెంట్లు, టెక్నీషియన్లు కలిసి వివిధ ప్రాంతాల్లోని బిచ్చగాళ్లు, రోజువారీ కూలీలను గుర్తించి వీర్యాన్ని సేకరిస్తుండగా, మహిళల నుంచి అండాలు కూడా సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు ఆశ చూపడం, బిర్యానీ ప్యాకెట్, మద్యం బాటిల్లు ఇవ్వడం వంటి ప్రలోభాల ద్వారా ఈ దందా సాగుతుందని సమాచారం.
చదువులేని, ఆరోగ్య ప్రమాణాలకు సరిపోని వ్యక్తుల నుంచి వీర్యం, అండాలను సేకరించి డబ్బు కోసం దాతలుగా వినియోగించిన ఈ వ్యవహారం ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా నైతికంగా కూడా తీవ్రంగా విమర్శించబడుతోంది.
ఆర్ట్ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) చట్టం ప్రకారం 21-55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఆరోగ్యవంతుల నుంచి మాత్రమే వైద్య పరీక్షల అనంతరం వీర్యం, అండాలను సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సార్లు మాత్రమే వీర్యం సేకరించవచ్చు. కానీ ఈ సంస్థ వారానికొకసారి చొప్పున ఒకే వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరిస్తూ చట్టాన్ని ఉల్లంఘించింది.
అలాగే, మహిళల నుంచి అండాలు సేకరించేందుకు ఆయా మహిళలను లాక్కొచ్చిన వారికి మాదకద్రవ్యాలు, బిర్యానీ ఇచ్చి పంపేవారిగా సమాచారం. అండదానం చేసిన మహిళలకు రూ.20 వేలు నుండి రూ.25 వేలు చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో నిందితులను మళ్లీ కస్టడీకి తీసుకుని మరింత లోతైన విచారణ చేపట్టేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.


Comments