మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజిగిరి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉప్పల్లో జిల్లా స్థాయిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించిందని తెలిపారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడం కాకుండా ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.రాజ్యాంగంలోని రిజర్వేషన్ల ద్వారా సమాజంలో సమానత్వం ఏర్పడిందని, బడుగు బలహీన వర్గాల వారు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు.సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్ కళాకారులు ఆలపించిన అంబేద్కర్ గీతాలు ఆకట్టుకున్నాయి.అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక చెక్కులు అందజేసి, దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వారికి ‘దళిత రత్న’ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Comments