డబుల్ బెడ్రూమ్ దుకాణాల వేలం ఆపాలని సిపిఎం వినతి.
_మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం
– లబ్ధిదారులకే కిరాయిలకు ఇవ్వాలని డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ పరిధిలోని వాణిజ్య దుకాణాల వేలం అమ్మకాలను నిలిపివేయాలని సిపిఎం నేతలు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పి. సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. శ్రీనివాసులు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల్లో పేద, బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాలని అన్నారు. కాలనీల నిర్వహణ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించి వచ్చిన నిధులను జిల్లా కలెక్టర్, కాలనీ సొసైటీల సంయుక్త ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఆ నిధులపై వచ్చే వడ్డీని కాలనీల మెయింటెనెన్స్కు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సిపిఎం నేతలు తమ వినతిపత్రంలో జిల్లాలోని 12 డబుల్ బెడ్రూమ్ కాలనీలలో 892 దుకాణాలను ఏప్రిల్ 15, 17 తేదీల్లో వేలం వేయాలన్న నిర్ణయం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. దుకాణాలను కిరాయికి ఇస్తే వచ్చే ఆదాయంతో లిఫ్టులు, ఇతర సదుపాయాల నిర్వహణ సులభమవుతుందని, అమ్మకాల వల్ల భవిష్యత్తులో వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.అలాగే కాలనీల మరమ్మతులు, అభివృద్ధి పనులు, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ఎస్టీపీలు వంటి సదుపాయాల నిర్వహణను కూడా ప్రభుత్వమే చేపట్టాలని సిపిఎం బృందం వినతిపత్రంలో కోరింది.


Comments