ఎన్ఎఫ్సి ఆర్ఓబి విస్తరణకు సిపిఎం వినతి.
_ట్రాఫిక్ రద్దీతో ప్రజలకు ఇబ్బందులు
– వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వినతి
నాచారం, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలోని ఎన్ఎఫ్సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి)ను విస్తరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మల్కాజ్గిరి మహానగర పాలక సంస్థ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, కాప్రా సర్కిల్ కార్యదర్శి జి. శ్రీనివాసులు, సర్కిల్ కమిటీ సభ్యులు పి. గణేష్, సఫియా మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం తర్వాత ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.నాచారం, మల్లాపూర్, మౌలాలి, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలతో పాటు సమీప పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని తెలిపారు. బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, భారీ వాహనాల రాకపోకలు పెరగడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు కూడా సకాలంలో చేరలేకపోతున్నాయని తెలిపారు. కాబట్టి ఎన్ఎఫ్సి ఆర్ఓబి విస్తరణకు తక్షణమే నిధులు మంజూరు చేసి, రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ పనులు ప్రారంభించాలని సిపిఎం నాయకులు కమిషనర్ను కోరారు.


Comments