అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా.
బేతుపల్లిలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహణ.
సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
బేతుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, దేశానికి చేసిన విశిష్ట సేవలను గ్రామ ప్రజలకు వివరించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడిగా కొనియాడారు.
సామాజిక అసమానతల నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అపూర్వమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ “విద్య పొందండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి” అనే ఆయన సందేశాన్ని గుర్తుచేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, స్వాభిమాన భావనల కోసం ఆయన చూపిన మార్గం నేటికీ అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తూ, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.


Comments