అంబేద్కర్ అందరివాడు
వరంగల్ ఎంపీ కడియం కావ్య
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆమె అంబేద్కర్ ఒక వర్గం, కులం, మతానికి పరిమితమైన నాయకుడు కాదని, దేశంలోని ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన కల్పించిన హక్కులే దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల వల్లనే సమాజంలో అణగారిన వర్గాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు.
మహిళల సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ, మహిళలకు ఓటు హక్కు, విద్య హక్కు వంటి అనేక అవకాశాలను రాజ్యాంగం ద్వారా కల్పించిన ఘనత ఆయనదేనని చెప్పారు. లేబర్ చట్టాలు, ఎనిమిది గంటల పని విధానం, ప్రసూతి సెలవులు, హిందూ కోడ్ బిల్ వంటి కీలక సంస్కరణలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని తెలిపారు.దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లుపై స్పష్టత లేకపోవడం విచారకరమని పేర్కొంటూ, ప్రజల పక్షాన నిలిచే విధానాలే అమల్లోకి రావాలని అన్నారు. చదువు ద్వారా మాత్రమే వ్యక్తి చీకటి నుంచి వెలుగులోకి వస్తాడని, విద్యనే జీవితాలను మార్చే శక్తిగా భావించాలని సూచించారు. ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ పరిపాలనలో భాగస్వాములు అవుతారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.


Comments