రాజరాజేశ్వర గార్డెన్స్లో అంబేద్కర్ జయంతి వేడుకలు.
_ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
రాజరాజేశ్వర గార్డెన్స్లో కంటోన్మెంట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అంబేద్కర్ సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యత వంటి సమస్యలను స్వయంగా అనుభవించి, వాటి నిర్మూలన కోసం రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఆయనను కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేయడం సరైంది కాదని, సమసమాజ స్థాపనకు మార్గదర్శకుడని పేర్కొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా కుల వివక్ష పూర్తిగా తొలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సమానంగా అందరికీ చేరాలని అంబేద్కర్ ఆశయమని తెలిపారు. పేదల కు గూడు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.కంటోన్మెంట్ కార్మికులకు కంపాషినేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ సమంజసమని, మురికి కాలువలు శుభ్రం చేసే కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా ఈ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తుచేశారు.షాపుల లీజులు ముగిసిన కారణంగా చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం తగదని విమర్శించారు. పేదలపై అన్యాయం జరిగితే తాను ముందుండి పోరాడతానని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, వాటి సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


Comments