రబీ ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు పూర్తి.
_ఏప్రిల్ 25 నుంచి 15 కొనుగోలు కేంద్రాల ప్రారంభం
– 48 గంటల్లో రైతులకు చెల్లింపులు
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పౌరసరఫరాల కార్యాలయం లో అదనపు జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) డి. విజయేందర్ రెడ్డి అధ్యక్షతన రబీ 2025-26 సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎల్. సుగుణ బాయి, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి నాగలింగా చారి, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్తో పాటు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొనుగోళ్లకు అవసరమైన గన్నీలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతులు తమ వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరచి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వరికోత సమయంలో యంత్రాల యజమానులతో సమన్వయం చేసుకుని ధాన్యం సకాలంలో కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవకుండా అదే రోజు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు నిరంతర సమీక్ష నిర్వహించాలని, రైతులు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలోపే వారి ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమ అవుతాయని తెలిపారు.చివరి గా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.


Comments