ప్రజావాణి అర్జీలకు వెంటనే పరిష్కారం కల్పించాలి.
_మేడ్చల్–మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశాలు
_181 ఫిర్యాదులు స్వీకరణ
– ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని సూచన

మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించినప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జెడ్పీ సీఈవో కాంతమ్మతో కలిసి మొత్తం 181 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి అధికారిపై బాధ్యతగా ఉందన్నారు. అందువల్ల అర్జీల పరిశీలనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.తిరస్కరించాల్సిన దరఖాస్తుల విషయంలో కారణాలను స్పష్టంగా అర్జీదారులకు తెలియజేయాలని, స్వీకరించిన ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను ఆన్లైన్లో వెంట వెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments