జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
ఉత్సవాలను రాజకీయ వేదికగా మార్చారంటూ తీవ్ర ఆగ్రహం
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలపై వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం సరైన విధంగా నిర్వహించకుండా రాజకీయ వేదికగా మార్చారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
పాత మున్సిపల్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు సరిగా జరగలేదని ఆరోపించారు. ఉదయం చిన్నపాటి కార్యక్రమంతో అధికారులు బాధ్యత తప్పించుకున్నారని విమర్శించారు.
సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటల కార్యక్రమానికి ఆహ్వానించిన కళాకారుడు మిట్టపల్లి సురేందర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది అంబేద్కర్ జయంతి కార్యక్రమమా లేక రాజకీయ సభా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను గుర్తు చేస్తూ, కార్యక్రమాన్ని రాజకీయ ప్రసంగాలతో నింపడం అనుచితమని అన్నారు. ఎమ్మెల్యే కూడా అంబేద్కర్ ఆశయాలపై మాట్లాడకుండా ఇతర అంశాలు ప్రస్తావించారని విమర్శించారు.
ఈ ఘటనపై మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, కమిషనర్లపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి వంటి కార్యక్రమాలను రాజకీయాలకు వేదికగా ఉపయోగించడం తగదని హెచ్చరించారు.


Comments