ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో తీవ్రంగా పెరుగుతున్న కోతుల బెడదను శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
గురువారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, పాత కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లతో కార్మికులను మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.
రైతు వ్యతిరేక విధానాలతో విత్తన చట్టాలు, విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తున్నారని, సబ్సిడీలు తగ్గించి ఉచిత విద్యుత్ను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి, సీటు ప్లస్ 50 శాతం ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు బస్సు ఉచితం తప్ప ఇతర హామీలు అమలు కాలేదని తెలిపారు.
జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయని, పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు.
అలాగే మే డేను గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని, పేద ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, గేరా రాజకుమారి, గడ్డం శోభన్, బైరం సమ్మయ్య, సిహెచ్ రామస్వామి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments