పెద్దచర్లపల్లి చౌరస్తాలో ఉద్రిక్తత
_మహనీయుల విగ్రహాల తొలగింపుతో స్థానికుల్లో ఆగ్రహం
_ధర్నా చేపట్టిన నాయకుల అరెస్ట్, ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలింపు
_మంత్రి జోక్యంతో విచారణకు ఆదేశాలు
_బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
_శాంతియుతంగా సమస్య పరిష్కారం కోరిన నాయకులు
చర్లపల్లి, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్దచర్లపల్లి చౌరస్తాలో మహనీయుల విగ్రహాల తొలగింపు ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను అధికారులు అకస్మాత్తుగా తొలగించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.ఈ ఘటనపై సామాజిక వర్గాలు, స్థానిక నాయకులు తీవ్రంగా స్పందిస్తూ నిరసనలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెంటనే స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.అనంతరం జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి ఘటన సున్నితత్వాన్ని వివరించారు. మంత్రి చొరవతో జీహెచ్ఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సంబంధిత డిసిపికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, ఘటనపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు.ఇదిలా ఉండగా, విగ్రహాల తొలగింపును నిరసిస్తూ పెద్దచర్లపల్లి చౌరస్తాలో ధర్నా చేపట్టిన స్థానిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, మహనీయుల విగ్రహాల పట్ల అగౌరవంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, శాంతియుతంగా న్యాయం సాధించేందుకు కట్టుబడి ఉన్నామని నాయకులు తెలిపారు.


Comments