చర్లపల్లి బస్టాండ్లో మహనీయుల విగ్రహాల తొలగింపు…
_ఆందోళనలు, అరెస్టులు
_దళిత సంఘాల నిరసనలు ఉధృతం
– సోమశేఖర్ రెడ్డితో పాటు 20 మంది అదుపులోకి
చర్లపల్లి, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ చర్లపల్లి బస్టాండ్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న దళిత సంఘాలు, వివిధ సంస్థల నాయకులు పెద్ద ఎత్తున చర్లపల్లి బస్టాండ్కు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి సోమశేఖర్ రెడ్డితో పాటు సుమారు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయమని, ఇది సామాజిక వర్గాల భావోద్వేగాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు.విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను విస్తరిస్తామని హెచ్చరించారు.ఇటీవలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే విగ్రహాలను తొలగించడం మహనీయులను అవమానించినట్టేనని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Comments