విద్యుత్ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు :జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై గ్రామస్థాయిలో సమీక్షలు చేపట్టాలని ఆమె సూచించారు.
రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఓవర్లోడ్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లూజ్ లైన్ల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో మిడిల్ పోల్స్ను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పాలకుర్తి మండలంలో 400 మిడిల్ పోల్స్, కొడకండ్ల మండలంలో 300 మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె పేర్కొన్నారు.విద్యుత్ లోడింగ్ సమస్యలను అధిగమించేందుకు పాలకుర్తి మండలంలోని తొర్రూరు, మల్లంపల్లి, ముత్తారం గ్రామాల్లో మూడు సబ్ స్టేషన్లను మంజూరు చేసి నిర్మాణ పనులు వేగవంతం చేశామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులతో సమన్వయం సాధించి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. “రైతులకు విద్యుత్ సరఫరా సమస్యల వల్ల ఇబ్బందులు కలిగితే చర్యలు తప్పవు” అని ఎమ్మెల్యే హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, వివిధ గ్రామ పార్టీల సభ్యులు పాల్గొన్నారు.


Comments