దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్నే రక్ష
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరి సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశానికి, రాష్ట్రానికి రక్షణగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం, సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వ సమయంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని ఆపకుండా కొనసాగిస్తోందని తెలిపారు.
బీజేపీ బూటకపు గుజరాత్ మోడల్ను ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చిందని ఎంపీ విమర్శించారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడ అభివృద్ధి అనేది కనిపించలేదని చెప్పారు. బీజేపీ నాయకులు మతోన్మాదాన్ని నమ్మితే, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.
దేశ ఆస్తులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ బీజేపీ పాలన సాగుతోందని విమర్శించారు. మైనారిటీలపై, మహిళలపై వివక్ష చూపుతూ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆమె అన్నారు. ఈ అణచివేతలను ప్రతి అడుగులోనూ ప్రశ్నిస్తున్నవారు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురాలి అని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త రాహుల్ గాంధీ సైనికుడిగా పనిచేయాలని కోరుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.


Comments