వాణిజ్య సముదాయాల వేలం నిలిపివేయాలి _సీపీఐ(ఎం)
_లబ్ధిదారులపై భారం పడకుండా చర్యలు
– ప్రత్యేక నిధులు, కార్పస్ ఫండ్ కేటాయించాలని డిమాండ్
చర్లపల్లి, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని డబుల్ బెడ్ రూం కాలనీలలో ఉన్న వాణిజ్య సముదాయాలను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరింది.మంగళవారం కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి, శ్రీరామ్ నగర్ 2బిహెచ్కే కాలనీల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ, జిల్లాలోని 16 డబుల్ బెడ్ రూం కాలనీలలో ఉన్న సుమారు 992 వాణిజ్య సముదాయాల విక్రయం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.కాలనీల నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు, లబ్ధిదారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ సముదాయాలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. వాటి నుంచి వచ్చే కిరాయిలను లిఫ్ట్ నిర్వహణ, విద్యుత్, ఇతర అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాటిని విక్రయిస్తే భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులు పూర్తిగా లబ్ధిదారులపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వాణిజ్య సముదాయాల అమ్మకాల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక పరిష్కారమేనని, దీర్ఘకాలంలో కాలనీల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కిరాయిల వసూళ్లలో సమస్యలు ఉన్నాయనే కారణంతో అమ్మకానికి వెళ్లడం సరికాదని, బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కాలానుగుణంగా వేలం ద్వారా కిరాయికి ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ నెల 15 నుంచి వాణిజ్య సముదాయాల వేలంపాట నిర్వహించనున్న ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.అలాగే కాలనీల్లో అసంపూర్ణ పనులు పూర్తి చేయడానికి, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి నిర్వహణకు వినియోగించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు కోమటి రవి, జి. శ్రీనివాసులు, ఎర్ర అశోక్, పి. గణేష్, శివన్నారాయణ, రాములు నాయక్ తదితరులు, కాలనీ లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments