జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్
_సమన్వయంతో చర్యలు చేపట్టాలి
– బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ సీత దయాకర్
మేడ్చల్ మల్కాజ్గిరి, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కీసర సర్కిల్ పరిధిలో జవహార్ నగర్లో 0–18 ఏళ్ల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ సీత దయాకర్ సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడి పిల్లలకు విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని అన్నారు.జవహార్ నగర్లో బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, స్కూల్ డ్రాప్అవుట్, లైంగిక దుర్వినియోగం వంటి సమస్యలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్కూల్కు వెళ్లని పిల్లలు, చదువు మానేసిన వారి వివరాలను సేకరించాలని సూచించారు.ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు ఆధార్, జనన, కుల ధృవపత్రాలు లేని పిల్లలకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా అందించాలని కోరారు. చైల్డ్ లేబర్ గుర్తింపునకు “ఆపరేషన్ ముస్కాన్” తరహాలో చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ అన్ని శాఖలు, ఎన్జీఓల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, అంగన్వాడీ ఫ్యామిలీ సర్వే డేటాను వినియోగించి పిల్లల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చాలని అన్నారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కమిషన్ సభ్యులు, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments