పరిగిలో భూసేకరణపై రాకేష్ రెడ్డి ఆగ్రహం..
అరెస్టులను ఖండించిన బీఆర్ఎస్
హన్మకొండ,ఏప్రిల్07(తెలంగాణ ముచ్చట్లు):
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణ నేపథ్యంలో దళిత, గిరిజనులను ప్రభుత్వం వేధిస్తున్నదని ఆరోపిస్తూ, వారికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని మరియు భూ నిర్వాసితులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిగి ప్రాంతంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న దళిత, గిరిజనులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారికి మద్దతు తెలపడానికి వెళ్లిన మాజీ మంత్రులను అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించదగ్గ చర్య అని పేర్కొన్నారు. శాంతియుతంగా అనుమతి తీసుకునేందుకు పోలీస్ స్టేషన్కు పిలిచి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారిని అక్కడే నిర్బంధించడం అమానవీయమని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుత పాలన ప్రారంభమైనప్పటి నుండి భూసంబంధిత సమస్యలపైనే అధిక దృష్టి పెట్టినట్టు ఆరోపిస్తూ, పలు ప్రాంతాల్లో దళిత, గిరిజన భూములపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రజల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి వెళ్లిన నాయకులను వెంటాడి అరెస్ట్ చేయడం అనుచితమని పేర్కొన్నారు.దళిత, గిరిజన భూ నిర్వాసితులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వారిని విడుదల చేసి తమ ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.


Comments