దివ్యాంగులు మానసికంగా కృంగిపోకుండా రాణించాలి
105 మందికి మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
దివ్యాంగులు మానసికంగా కృంగిపోకుండా అన్ని రంగాల్లో రాణించాలని, వారి అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈసీఐఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ కుమార్ తెలిపారు.అణుశక్తి శాఖ (డీఏఈ) ఆధ్వర్యంలోని సీపీఎస్ఈ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లా దివ్యాంగులకు బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రైసైకిళ్లను పంపిణీ చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ సమక్షంలో 105 మంది లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా అనురాగ్ కుమార్ మాట్లాడుతూ, శారీరక పరిమితుల కారణంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్న దివ్యాంగులకు ఈ ట్రైసైకిళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. సహాయక పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి స్వావలంబన, స్వాతంత్ర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి ఈసీఐఎల్ సీఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈసీఐఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పి. కృష్ణ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా కేవలం ట్రైసైకిళ్లను మాత్రమే కాకుండా, దివ్యాంగులకు స్వేచ్ఛ, గౌరవం, గొప్ప కలలు కనే అవకాశాన్ని ఈసీఐఎల్ అందిస్తోందని అన్నారు.నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కోసం ఈసీఐఎల్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఈడీ (హెచ్ఆర్) సంతోష్ రామస్వామి, సీఎంఓ &ఇన్చార్జ్ సీఎస్ఆర్ డాక్టర్ పి. వేణు బాబు, డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్) సునీల్ కుమార్, ఆఫీసర్-టి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Comments