డాక్టర్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూమి పూజ చేసిన చిన్నారెడ్డి
వనపర్తి,నవంబర్10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రత్యేక చొరవతో, ఆరు గ్రామాలు మరియు 13 గిరిజన తాండాల్లో దాదాపు 5,000 ఎకరాలకు సాగు నీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మార్చి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి బహిరంగ సభలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించిన సందర్భంలో డాక్టర్ జిల్లెల మాధవ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేశారు. సభలో హర్షధ్వనులు హోరెత్తాయి.
సోమవారం ప్రాజెక్ట్ సర్వే పనులకు డాక్టర్ చిన్నారెడ్డి భూమి పూజ నిర్వహించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతానికి సాగు నీరు అందలేదు. కాశీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తయిపల్లి, అంజనగిరి గ్రామాలు మరియు 13 గిరిజన తాండాలకు సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరగా, డాక్టర్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5,000 ఎకరాలకు సాగునీరు అందించాలని మంజూరు అయ్యిందని తెలిపారు.
ప్రాజెక్ట్ బి8 నుంచి రామన్న గట్టు రిజర్వాయర్ కు నీళ్లు తేవడం ద్వారా అమలు చేయబడుతుంది. అక్కడి నుంచి మూడు లిఫ్ట్ల ద్వారా సాగునీరు పంపిణీ చేయబడుతుంది. మొదటి లిఫ్ట్ ద్వారా కాశీంనగర్ ప్రాంతానికి 1,000 ఎకరాలకు, రెండో లిఫ్ట్ ద్వారా దత్తయిపల్లి మరియు అంజనగిరి ప్రాంతాలకు 1,000 ఎకరాలకు, మూడో లిఫ్ట్ ద్వారా జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి మరియు దత్తయిపల్లి ప్రాంతాలకు 3,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
సర్వే పనులకు ప్రభుత్వం 22 లక్షల రూపాయలు మంజూరు చేసింది. సర్వే పూర్తయిన తర్వాత డిపిఆర్ కు సమర్పించి, ఆమోదం పొందిన తరువాత లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కానున్నాయి.
చిన్నారెడ్డి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి రైతులందరికీ సాగునీరు అందించాలని, ప్రాజెక్ట్కు డాక్టర్ మాధవ రెడ్డి పేరును మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, నందిమల్ల రాము, కాశీంనగర్ రైతులు, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు


Comments