హెచ్ఐవి,ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహనా ర్యాలీ
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో భద్రకాళి దేవాలయం ఆర్చ్ నుంచి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ సి.హెచ్. రమేశ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి-ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద ముగిసిన ర్యాలీ
కాకతీయ మెడికల్ కాలేజీ ఎన్నారై ఆడిటోరియం వరకు ప్లా కార్డులు, నినాదాలు, కళా ప్రదర్శనలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశానికి డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ. అప్పయ్య అధ్యక్షత వహించారు.
సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షేమ దేశ్ పాండే మాట్లాడుతూ యువత అవగాహన పెంచుకుని ఇతరులకు సూచనలు చేయడం ద్వారా ఎయిడ్స్ నియంత్రణలో కీలక పాత్ర పోషించవచ్చని పేర్కొన్నారు. అలాగే, హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు సరైన చికిత్స తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
.jpeg)
ఎయిడ్స్ నియంత్రణలో తాజా సమాచార హనుమకొండ జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య వివరాలు అందిస్తూ, జిల్లాలో ప్రతి నెల 5 కొత్త హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయని, రక్తపరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2023-24లో 31,205 మందికి పరీక్షలు నిర్వహించగా 86 మందికి హెచ్ఐవి నిర్ధారణ అయిందని తెలిపారు.
సేవలను ప్రశంసించిన నిర్వాహకులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ వైద్య అధికారులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


Comments