విపత్తు సమయంలో అవసరమైన సేవలందించేందుకు పూర్తి స్థాయి సిద్ధత
జిల్లా కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ఏదైనా విపత్తు సంభవించిన సమయంలో ప్రజలకు అవసరమైన సేవలను వేగవంతంగా అందించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డిఎంఏ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈ నెల 22న నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమంపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్డిఎంఏ డైరెక్టర్ సుధీర్ బాల్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ వరదలు, పరిశ్రమల ప్రమాదాలు, రహదారి ప్రమాదాలు సహా వివిధ రకాల విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి రిలీఫ్ క్యాంపుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తు నిర్వహణలో సమన్వయం పెంపొందించేందుకు ఏటా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా (లోకల్ బాడీస్), అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి (రెవెన్యూ), డీఆర్ఓ హరిప్రియ, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణ సమయంలో జిల్లాలో ఎస్డిఆర్ఎఫ్, పోలీస్ బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని, లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడిఎఫ్ఓ వెంకన్న, ఉప్పల్ ఎమ్మార్వో ఫూల్ సింగ్ చౌహాన్, డీఎంహెచ్ఓ డాక్టర్ సి. ఉమా గౌరీ, ఆర్టీఏఓ ఉప్పల్ వి. ఉమాజీఎం డీఐసీ & జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు


Comments